మోకాళ్ల నొప్పిని ‘వయసు’ అంటూ వదిలేయొద్దు!
సకాలంలో చికిత్సతో కదలికల స్వేచ్ఛను కాపాడుకోవచ్చు
నల్గొండ, స్థానికం ప్రతినిధి:
మోకాళ్ల నొప్పి వయసు పైబడటంలో సహజమేనని భావించి నిర్లక్ష్యం చేయొద్దని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ తాటికొండ డాక్టర్ సాయి దినేష్ సూచించారు. నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర రెస్టారెంట్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్పై అవగాహన కల్పించారు.
మోకాలి కీలు అరిగిపోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుందని తెలిపారు. తొలిదశలో మెట్లు ఎక్కడం, ఎక్కువ దూరం నడవడం ఇబ్బందిగా మారుతుందని, తర్వాత కుర్చీలోంచి లేవడం, నేలపై కూర్చోవడం, షాపింగ్, ప్రయాణం వంటి సాధారణ పనులు కూడా కష్టంగా మారుతాయని వివరించారు. క్రమంగా ఇతరులపై ఆధారపడే పరిస్థితి రావచ్చన్నారు.
చికిత్స ఆలస్యం చేయొద్దు
తొలి దశలో బరువు నియంత్రణ, వ్యాయామం, ఫిజియోథెరపీ, మందులు, ఇతర తగిన చికిత్సలతో నొప్పిని అదుపులో ఉంచి మోకాలి పనితీరును కాపాడుకోవచ్చని డాక్టర్ సాయి దినేష్ తెలిపారు. తీవ్రమైన నొప్పి ఉన్న ప్రతి ఒక్కరికీ శస్త్రచికిత్స అవసరం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఆర్థరైటిస్ తీవ్రంగా ఉండి రోజువారీ జీవనాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు శస్త్రచికిత్సను అనవసరంగా ఏళ్ల తరబడి వాయిదా వేయకూడదన్నారు.
లక్ష్యం.. మళ్లీ స్వేచ్ఛగా నడవడమే
మోకాలి మార్పిడి శస్త్రచికిత్స లక్ష్యం కేవలం ఎక్స్రేలో మోకాలి రూపాన్ని మార్చడం కాదని, నొప్పి లేకుండా నడవడం.. మెట్లు ఎక్కడం.. కుటుంబంతో కలిసి ప్రయాణించడం.. ఇతరులపై ఆధారపడకుండా రోజువారీ పనులు చేసుకోవడం వంటి స్వాతంత్ర్యాన్ని తిరిగి అందించడమేనని పేర్కొన్నారు.
మోకాళ్ల నొప్పి కారణంగా నడవడం, కూర్చోవడం, నిలబడడం, మెట్లు ఎక్కడం లేదా ప్రయాణం చేయడం ఇబ్బందిగా మారితే ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించి సరైన నిర్ధారణ చేయించుకోవాలని సూచించారు. మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ మీ స్వేచ్ఛను హరించాల్సిన అవసరం లేదని.. సరైన సమయంలో సరైన చికిత్సతో కదలికల స్వేచ్ఛను తిరిగి పొందవచ్చని డాక్టర్ సాయి దినేష్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి