మూసీ ప్రక్షాళనపై డీపీఆర్ ప్రకటించాలి
గోదావరి జలాలను మూసీ కాలువలు, చెరువులకు అనుసంధానం చేయాలి.
పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం తక్షణమే డీపీఆర్ ప్రకటించి, కలుషిత జలాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. శనివారం పోచంపల్లిలో జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
మూసీ జలాల కలుషితంతో పోచంపల్లి ప్రాంత రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నీటితో సాగవుతున్న పంటలు, కూరగాయలు, పండ్ల తోటలు, చేపల్లో విషపదార్థాల అవశేషాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారని, వీటిని వినియోగించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు.
గోదావరి జలాలతో మూసీకి పునర్జీవం.
ప్రజలు, పంటలను కాపాడేందుకు మూసీ ప్రక్షాళన చేపట్టడంతో పాటు గోదావరి జలాలను మూసీ పరిధిలోని కాలువలు, చెరువులకు అనుసంధానం చేయాలని జహంగీర్ సూచించారు. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను షామీర్పేట చెరువుకు తరలించి, అక్కడి నుంచి ఏదులాబాద్ చెరువును నింపేలా చర్యలు చేపట్టాలని కోరారు.
జిల్లాలో సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు బస్వాపురం, గంధమల్ల, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించి పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న పిల్లాయిపల్లి, బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి కాలువలకు నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని, ఆసిఫ్నగర్, బృందావనం కాలువలను పునరుద్ధరించాలని కోరారు.
మహాధర్నాకు తరలిరావాలి.
సాగునీటి ప్రాజెక్టులు, కాలువల పూర్తి, మూసీ ప్రక్షాళన, నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29, 30, 31 తేదీల్లో భువనగిరి నుంచి హైదరాబాద్ ఇంద్రాపార్క్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 31న ఇంద్రాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని జహంగీర్ పిలుపునిచ్చారు.
సమావేశానికి సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు పగిళ్ల లింగారెడ్డి అధ్యక్షత వహించగా, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు మంచాల మధు, ప్రసాదం విష్ణు, గూడూరు బుచ్చిరెడ్డి, మండల కమిటీ సభ్యులు నెల్లికంటి జంగయ్య, సామ జంగారెడ్డి, పత్తి బిక్షపతి, బోయపల్లి పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి