విదేశీ నిధులు స్వీకరించే స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల్లో మరింత పారదర్శకత తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు విదేశీ నిధులు పొందే ప్రతి సంస్థ తమ సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలను వెల్లడించడంతో పాటు, ఆ నిధులతో నిర్వహించే ప్రచార కార్యక్రమాలపై కూడా పూర్తి సమాచారాన్ని అందించాల్సి ఉండేలా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం.ప్రతిపాదిత మార్పుల ప్రకారం విదేశీ నిధులతో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. నిధులు ఏ పని కోసం వినియోగించారు, ఎక్కడ ఖర్చు చేశారు, ఎవరికి ప్రయోజనం చేకూరింది, నిధుల అసలు మూలం ఏమిటి వంటి వివరాలను స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే సామాజిక మాధ్యమాల్లో విదేశీ నిధులతో నిర్వహించే ప్రచార కార్యక్రమాల వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
డిజిటల్ వేదికల ద్వారా విదేశీ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, నిధుల వినియోగాన్ని మరింత సమర్థంగా పర్యవేక్షించడం, పారదర్శకతను పెంచడం, జాతీయ భద్రతను బలోపేతం చేయడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యంగా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు నిధుల లావాదేవీలపై మాత్రమే ప్రధానంగా నిఘా ఉండగా, ఇకపై ఆ నిధులతో జరిగే ప్రచార కార్యక్రమాలపై కూడా పర్యవేక్షణ పెరగనుంది.ఈ మార్పులు అమల్లోకి వస్తే విదేశీ నిధుల వినియోగంపై మరింత స్పష్టత ఏర్పడటంతో పాటు, నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి