విదేశాలకు పారిపోయిన నేరస్థులను చట్టం ముందు నిలబెట్టడంలో కేంద్ర ప్రభుత్వం వేగం పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో 2021–2026 మధ్య 36 దేశాల నుంచి 274 మంది పరారీ నేరస్థులను భారత్కు అప్పగింపజేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.పరారీ నేరస్థుల అప్పగింతను జాతీయ ప్రాధాన్యతగా తీసుకున్న కేంద్రం.. 2018లో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం అమల్లోకి తీసుకురావడంతో పాటు, సాంకేతికత, ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థతో నిందితుల ఆచూకీ గుర్తింపు, అప్పగింత ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపింది.
2014కు ముందు అప్పగింత వ్యవస్థ బలహీనంగా ఉండేదని కేంద్రం పేర్కొంది. అప్పట్లో భారత్కు కేవలం 37 దేశాలతో మాత్రమే అప్పగింత ఒప్పందాలు ఉండగా, 2004–2013 మధ్య ఏడాదికి సగటున నలుగురు నేరస్థులను మాత్రమే స్వదేశానికి తీసుకురాగలిగారని వివరించింది. పత్రాల లోపాలు, న్యాయపరమైన అడ్డంకులు, అంతర్శాఖ సమన్వయం లేకపోవడంతో అనేక అప్పగింత విజ్ఞప్తులు పెండింగ్లో ఉండేవని తెలిపింది.
మోదీ ప్రభుత్వం 2019లో ఎన్ఐఏ, యూఏపీఏ సవరణ చట్టాలు తీసుకువచ్చి, 2020 నుంచి పరారీ నేరస్థుల అప్పగింతను మిషన్ మోడ్లో చేపట్టినట్లు పేర్కొంది. విదేశాల్లో తలదాచుకున్న ఉగ్రవాదులు, వారి హ్యాండ్లర్లు, నిధుల సరఫరా వ్యవస్థలపై కూడా చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించింది.అలాగే 2024లో అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాల్లోని భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) నిబంధనల ప్రకారం నిందితుడు కోర్టుకు హాజరుకాకపోయినా విచారణ కొనసాగించి శిక్ష ఖరారు చేసే అవకాశం కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో విదేశాల్లో తలదాచుకున్న పరారీ నిందితులపై న్యాయ ప్రక్రియ మరింత వేగవంతం కానుందని పేర్కొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి