మద్యం తాగిన తర్వాత ఘర్షణ | తీవ్రగాయాలతో ఉస్మానియా ఐసీయూలో బాధితుడు
స్నేహితులతో కలిసి మద్యం తాగిన అనంతరం చోటుచేసుకున్న ఘర్షణలో ఓ యువకుడిపై యాసిడ్ వంటి ప్రమాదకర ద్రవంతో దాడి చేసి తీవ్రంగా కొట్టిన దారుణ సంఘటన చౌటుప్పల్ పట్టణంలో వెలుగుచూసింది. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ రోడ్డుకు చెందిన జెసిబి డ్రైవర్ షేక్ గౌస్ (19)ను ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అతని స్నేహితుడు బుడ్డా వినయ్ బయటకు తీసుకెళ్లాడు. అందరూ కలిసి మార్కండేయ నగర్లోని గంగోత్రి వాటర్ ప్లాంట్ సమీపంలో మద్యం తాగారు. ఆ తర్వాత స్నేహితుల మధ్య వివాదం రేగడంతో, వారంతా కలిసి గౌస్పై విచక్షణారహితంగా దాడి చేశారు. అంతేకాకుండా అతడిపై యాసిడ్ (లేదా ఏదైనా రసాయన ద్రవం) పోశారు. ఈ దాడిలో గౌస్ ఎడమ చెంప, తల, చెవి భాగం, ఎడమ ఛాతీ, భుజాలు, రెండు చేతులు, తొడలపై తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. దాడి అనంతరం గౌస్ తన అన్న షేక్ హైమద్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడు అందుబాటులో లేకపోవడంతో తన తండ్రి, ఇతర స్నేహితులను సంఘటనా స్థలానికి పంపించాడు. భయాందోళనకు గురైన గౌస్ అక్కడి నుంచి పరిగెత్తి కేసీఆర్ కాలనీలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద ఉన్న ఒకరి ఇంట్లో దాచుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గౌస్ ఐసీయూలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. బాధితుడి అన్న షేక్ హైమద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చౌటుప్పల్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జీ మన్మధ కుమార్ తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి