చౌటుప్పల్లో వెలుగుచూసిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం |
తప్పులు సరిదిద్ది నూతన పాస్బుక్ ఇవ్వాలని 90 ఏళ్ల వృద్ధుడి ఆవేదన
పూర్వీకుల నుంచి సంక్రమించిన వ్యవసాయ భూమిని రియల్టర్ల ప్రయోజనాల కోసం తప్పుడు రికార్డులతో వివాదాస్పదం చేశారని 90 ఏళ్ల వృద్ధుడు, ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాకారుడు ఎరుకల భీమయ్య గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారుల తప్పుడు నమోదుల కారణంగా ఏళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.ఒకే పహాణీలో రెండు రకాల ఎంట్రీలు చౌటుప్పల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 6లో ఉన్న 1 ఎకరం 07 గుంటల భూమిని పూర్వపు వీఆర్వోలు ఒకే కాలానికి సంబంధించిన పహాణీల్లో ఒకచోట ‘వ్యవసాయ భూమి’గా, మరోచోట ‘పీడబ్ల్యూడీ రోడ్డు’గా నమోదు చేశారని తెలిపారు. ఈ భూమి వద్ద ఎలాంటి రోడ్డు లేదని, భూసేకరణ జరగలేదని ఆర్అండ్బీ అధికారులతో పాటు ఆర్డీవో, మండల సర్వేయర్లు ఇచ్చిన నివేదికల్లో తేలిందని పేర్కొన్నారు. రికార్డుల్లో (టిప్పన్, సేత్వార్) కూడా స్పష్టంగా తన భూమి ఉనికి ఉన్నట్లు వెల్లడైందని చెప్పారు. గతంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేయగా, తప్పును సరిదిద్ది పాస్బుక్ ఇస్తామని అప్పటి ఆర్డీవో హామీ ఇచ్చి నెరవేర్చలేదని వాపోయారు. దీంతో చివరకు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించగా.. రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. రియల్టర్ల కోసం తప్పుడు రికార్డులు సృష్టించిన వీఆర్వోలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, తన జీవిత చరమాంకంలోనైనా న్యాయం చేసి నూతన పాస్బుక్ అందజేయాలని భీమయ్య గౌడ్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి