శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి... జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
ఆన్లైన్ పోర్టల్లో మండపాల నమోదు తప్పనిసరి...
సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా...
నల్గొండ : రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలు, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. ఉత్సవాల వేళ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలు, వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.
లౌడ్ స్పీకర్లపై నియంత్రణ డి.జేలపై పూర్తి నిషేధం..
ఉత్సవాల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దాన్ని చేసే డి.జే (DJ) సౌండ్ సిస్టమ్లపై పూర్తి నిషేధం విధించినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. వినాయక మండపాల వద్దగాని, శోభాయాత్ర (ఊరేగింపు)లోగాని ఎట్టి పరిస్థితుల్లోనూ డి.జేలు ఏర్పాటు చేయకూడదన్నారు. సాధారణ లౌడ్ స్పీకర్లను కూడా తక్కువ శబ్దంతో రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలి. నిబంధనలు ఉల్లంఘించి డి.జేలు లేదా అధిక శబ్ద సిస్టమ్లు ఏర్పాటు చేస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలు మరియు ఇతర ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగేలా శబ్ద కాలుష్యం చేయరాదు.
ఆన్లైన్ నమోదు & అనుమతులు తప్పనిసరి...
వినాయక విగ్రహాలు ప్రతిష్టించే నిర్వాహకులు ముందుగా https://policeportal.tspolice.gov.in/index.htm వెబ్సైట్లో మండపం వివరాలను నమోదు చేయాలి. అనంతరం ఆ దరఖాస్తు ప్రతిని సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లో అందజేసి అనుమతి పొందాలని ఎస్పీ సూచించారు.
సోషల్ మీడియాపై ప్రత్యేక మానిటరింగ్ సెల్...
సామాజిక మాధ్యమాల్లో ఇతర మతాల వారి మనోభావాలు దెబ్బతినేలా ఎలాంటి వ్యాఖ్యలు లేదా పోస్టులు చేయకూడదని ఎస్పీ హెచ్చరించారు. సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక 'మానిటరింగ్ సెల్' ఏర్పాటు చేశారు. వదంతులు, రూమర్లను నమ్మకూడదని.. ఎలాంటి అనుమానాలు ఉన్నా తక్షణమే పోలీసులకు లేదా 'డయల్ 112' కు సమాచారం అందించాలని కోరారు.
గణేష్ మండప నిర్వాహకులు పాటించవలసిన నిబంధనలు..
- స్థల & విద్యుత్ అనుమతి: మండపం ఏర్పాటు చేసే స్థల యాజమానుల అనుమతి తీసుకోవాలి. విద్యుత్ శాఖ అధికారిక అనుమతితోనే కనెక్షన్ పొందాలి.
- విద్యుత్ భద్రత: షార్ట్ సర్క్యూట్ జరగకుండా మంచి నాణ్యత గల వైర్లు, స్విచ్లను ఉపయోగించాలి.
- కమిటీ వివరాల ప్రదర్శన: మండప బాధ్యుల పేర్లు, కమిటీ సభ్యుల వివరాలు మరియు ఫోన్ నెంబర్లను ప్రదర్శించే బోర్డును మండపంలో స్పష్టంగా ఏర్పాటు చేయాలి.
- రహదారులకు ఇరుపక్కలే మండపాలు: రద్దీ, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా విగ్రహాలను రోడ్డుకు ఇరుపక్కల ప్రతిష్టించాలి. ప్రధాన రహదారులకు అడ్డంకిగా ఏర్పాటు చేయకూడదు.
- భద్రతా ఏర్పాట్లు: విగ్రహాల వద్ద నాణ్యమైన వేదిక (స్టేజ్), షెడ్ నిర్మించాలి. 24 గంటలూ మండపం వద్ద కనీసం ఇద్దరు వాలంటీర్లు అందుబాటులో ఉండాలి.
- క్యూలైన్లు: భక్తుల దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి, వాలంటీర్లను నియమించాలి.
- పూర్తి నిషేధం: మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం, అసభ్యకర నృత్యాలు ఏర్పాటు చేయడం, అన్యమతస్తులను కించపరిచే ప్రసంగాలు/పాటలపై పూర్తి నిషేధం ఉంటుంది.
- పాయింట్ పుస్తకం & సీసీ కెమెరాలు: ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. తనిఖీకి వచ్చే పోలీస్ అధికారుల సంతకం, సూచనల కోసం 'పాయింట్ బుక్' అందుబాటులో ఉంచాలి.
- అనుమానాస్పద వస్తువులు: మండపాల వద్ద అనుమానాస్పద బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112 కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఉత్సవ కమిటీ నిర్వాహకులందరూ పోలీసు శాఖ సూచనలను పాటిస్తూ, పండుగను శాంతియుతంగా నిర్వహించుకోవడానికి సహకరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి