కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తల్లమల్ల హస్సేన్ డిమాండ్
సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు తల్లమల్ల హస్సేన్ డిమాండ్ చేశారు. బుల్లెట్ ట్రైన్ సాధన కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతుబజార్ సమీపంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 15వ రోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా అఖిల భారత రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్రెడ్డి తదితర నాయకులు, రైతులు దీక్షలో పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన తల్లమల్ల హస్సేన్ వారికి శుభాకాంక్షలు తెలిపి సంఘీభావం ప్రకటించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయడం జిల్లా ప్రజల హక్కు అని అన్నారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరడంతోపాటు రైల్వే శాఖకు కూడా గణనీయమైన ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు.
సూర్యాపేట ప్రజలు తమ హక్కుల సాధన కోసం పోరాట చరిత్ర కలిగిన గొప్ప యోధులని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు ఏకమై గత 40 నెలలుగా శాంతియుతంగా బుల్లెట్ ట్రైన్ సాధన కోసం పోరాడుతున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు.
కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం గతంలో ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ను మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టి, భవిష్యత్ తరాల ప్రయోజనాల కోసం సూర్యాపేట మీదుగా రైల్వే మార్గం సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి