చౌటుప్పల్ దారుణ హత్య కేసును ఛేదించిన పోలీసులు!
చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతంగి గ్రామం శనగలగుట్ట వద్ద అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య (36) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం... అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన దానయ్య భార్య రాపోలు శారద (34)కి, ఆమె స్వంత బావ కుమారుడైన రాపోలు శివ (19)తో అక్రమ సంబంధం ఏర్పడింది. తమ వివాహేతర సంబంధానికి భర్త దానయ్య అడ్డుగా ఉన్నాడని భావించిన శారద, ప్రియుడు శివతో కలిసి అతనిని అంతమెందించేందుకు పథకం వేసింది. ఈ నెల 23న మధ్యాహ్నం సమయంలో పంతంగి వద్ద దానయ్యపై ముందుగా రాయితో దాడి చేసి, ఆపై కర్రతో తలపై తీవ్రంగా కొట్టడంతో దానయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో, ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ నాయకత్వంలో పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో ఘటనా స్థలానికి చేరుకుని కీలక ఆధారాలు సేకరించారు.చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు నిందితులైన రాపోలు శివ, రాపోలు శారదలను వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు వారికి రిమాండ్ విధించింది. కేసును త్వరితగతిన ఛేదించిన ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్, ఎస్సైలు కె. యాదగిరి, పి. రవీందర్, బి. అజయ్ భార్గవ్, సిబ్బంది అశోక్, ఉదయ్, జంగయ్యలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి