ఇద్దరి పరిస్థితి విషమం.. పది మంది కార్మికులకు గాయాలు.
యాదాద్రి భువనగిరి జిల్లా: భూదాన్ పోచంపల్లి మండలం దోతీగూడెం గ్రామంలోని ఎజోలో ఫార్మా కంపెనీలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలోని రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి.
రియాక్టర్ పేలుడు ధాటికి కంపెనీలో పనిచేస్తున్న పది మంది కార్మికులు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను పోలీసులు, సిబ్బంది హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది.
పేలుడు శబ్దంతో ఉలిక్కిపడిన గ్రామాలు
రియాక్టర్ పేలిన సమయంలో భారీ శబ్దం రావడంతో దోతీగూడెం, అంతమ్మగూడెం గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి