తుంగతుర్తి;
సింగిల్ విండో కేంద్రాల్లో యూరియాను ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ చిల్లర ధరలకే రైతులకు విక్రయించాలని, యూరియా రవాణా చార్జీలను రైతుల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా రవాణా చార్జీలను రైతుల వద్దే వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా సహకార సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలకు సర్క్యులర్ జారీ చేయడం సరికాదన్నారు.గతంలో రవాణా చార్జీలను మార్క్ఫెడ్ ద్వారా చెల్లించి, రైతులకు ఎలాంటి అదనపు భారం లేకుండా ఎంఆర్పీ ధరకే యూరియాతో పాటు ఇతర సంక్లిష్ట ఎరువులను విక్రయించే విధానం ఉండేదని తెలిపారు.ప్రస్తుతం రవాణా చార్జీలను రైతులే భరించాల్సి వస్తే ప్రాంతాన్ని బట్టి ఒక్కో బస్తాపై రూ.33 నుంచి రూ.67 వరకు అదనపు భారం పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే వ్యవసాయ పెట్టుబడులు పెరిగి రైతులు అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నారని, దీనికి తోడు ఎరువులపై అదనపు భారం మోపడం మరింత ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడమేనని అన్నారు.రైతు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా వంటి పథకాలు సక్రమంగా అమలు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.మరోవైపు ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఎరువుల రవాణా చార్జీలను కూడా రైతులపైనే మోపడం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉందని అన్నారు.ప్రభుత్వం వెంటనే రవాణా చార్జీలు రైతుల నుంచి వసూలు చేయాలంటూ జారీ చేసిన సర్క్యులర్ను రద్దు చేసి, గతంలో మాదిరిగానే రైతులపై అదనపు భారం లేకుండా ఎంఆర్పీ ధరకే యూరియా, ఇతర ఎరువులను విక్రయించాలని తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల నాయకులు గునిగంటి యాదగిరి, కడారి దాసు, అన్నేబోయిన సురేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి