భువనేశ్వర్, ఆగస్టు 20: ప్రజా సంబంధాల రంగంలో సాంకేతిక విప్లవం తీసుకొస్తున్న మార్పులపై విస్తృత చర్చకు భువనేశ్వర్ వేదిక కానుంది. 48వ అఖిల భారత ప్రజా సంబంధాల సదస్సు–2026 పోస్టర్, బ్రోచర్ను ఒడిశా గవర్నర్ డా. హరిబాబు కంభంపాటి గురువారం రాజ్భవన్లో ఆవిష్కరించారు. దాదాపు ఐదు దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఈ జాతీయ సదస్సుకు ఒడిశా ఆతిథ్యం ఇవ్వనుంది.
‘నవగుంజర’.. ఏఐతో అనుసంధానం.
‘నవగుంజర–ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ప్రజా సంబంధాలు’ ఇతివృత్తంతో డిసెంబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు సదస్సు నిర్వహించనున్నారు. ఒడిశా సాంస్కృతిక ప్రతీక ‘నవగుంజర’ స్ఫూర్తితో రూపొందించిన ఇతివృత్తం.. మానవ మేధస్సు, కృత్రిమ మేధస్సు, సృజనాత్మకత, నైతిక విలువలు, మానవీయత సమన్వయాన్ని చాటనుంది.
దేశం నలుమూలల నుంచి ప్రముఖులు.
PRSI ఆధ్వర్యంలో, భువనేశ్వర్ చాప్టర్ ఆతిథ్యంలో జరగనున్న సదస్సుకు దేశవ్యాప్తంగా ప్రజా సంబంధాలు, కార్పొరేట్ కమ్యూనికేషన్, మీడియా, ప్రభుత్వం, వ్యాపార, విద్యా రంగాలకు చెందిన నిపుణులు, ప్రముఖులు, విధాన నిర్ణేతలు హాజరుకానున్నారు. ఏఐతో వస్తున్న అవకాశాలతో పాటు కమ్యూనికేషన్ రంగంలో విశ్వాసం, విశ్వసనీయత, ప్రతిష్ఠను కాపాడుకోవడంపై చర్చలు జరగనున్నాయి.
సాంస్కృతిక వైభవానికి వేదిక.
సాంకేతిక అంశాల చర్చలతో పాటు ఒడిశా కళలు, సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వం, ఆతిథ్యాన్ని ప్రతినిధులు ఆస్వాదించే అవకాశం కల్పించనున్నారు. దీంతో AIPRC–2026 వృత్తి నైపుణ్యం, సాంకేతిక విజ్ఞానం, సాంస్కృతిక వైవిధ్యాల సమ్మేళనంగా నిలవనుంది.
కార్యక్రమంలో PRSI జాతీయ అధ్యక్షుడు డా. అజిత్ పాఠక్, సెక్రటరీ జనరల్ డా. పి.ఎల్.కె. మూర్తి, సదస్సు కన్వీనర్ డా. సంజయ్ కుమార్ సాహూ, కో-కన్వీనర్ కృష్ణ చంద్ర మహాపాత్ర, ట్రెజరర్ అన్సుమన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి