నకిరేకల్: భారతరత్న, భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నకిరేకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించడం ద్వారా దేశ రాజకీయాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు. దేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు నడిపించి, ఐటీ విప్లవానికి పునాదులు వేసిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి ఆయన చేపట్టిన సంస్కరణలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల భారంలోకి నెడుతోందని, పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, మత విద్వేషాలు పెరుగుతున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు. యువత, పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రజా సంక్షేమం, దేశ అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని ఆకాంక్షించారు.
రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా 18 ఏళ్లు నిండిన యువతీ యువకుల ఓటరు నమోదును ఈ సందర్భంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి