ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె: జేఏసీ
ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆగస్టు 24 నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్లను నిలిపివేసి నిరవధిక సమ్మె చేపడతామని ఆటో, యాప్ ఆధారిత వాహన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు హెచ్చరించారు. సమ్మెను విజయవంతం చేయాలని ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లకు పిలుపునిచ్చారు.
బుధవారం నల్గొండలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షులు పెంజర్ల సైదులు అధ్యక్షతన ఆటో కార్మిక సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ, బీఆర్టీయూ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కలగోని యాదయ్య, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్, ఐఎన్టీయూసీ ఆటో యూనియన్ అధ్యక్షులు తాడేపల్లి దశరథ, ఆటో యూనియన్ నాయకులు చాగంటి రాములు మాట్లాడారు.
ఆర్టీసీ యాజమాన్యానికి ఈవీ ఆటోలను అప్పగించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆటో, రవాణా రంగ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, వారి జీవనోపాధికి భద్రత కల్పించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో యాప్ ఆధారిత సేవల వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గుతోందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ యాప్లకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక యాప్ను రూపొందించి అమలు చేయాలని జేఏసీ నాయకులు సూచించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాప్ ద్వారా ఆటో కార్మికులకు న్యాయమైన ఆదాయం, ప్రయాణికులకు పారదర్శకమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓలా, ఊబర్, ర్యాపిడో ద్వారా నడుస్తున్న ద్విచక్ర వాహన సేవలను నిషేధించాలని డిమాండ్ చేశారు.
ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని, డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను గతంలో ఉన్న పద్ధతిలోనే కొనసాగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సారథి పరివాహన్ యాప్లో అవసరమైన మార్పులు చేసి డ్రైవర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ఆగస్టు 24 నుంచి ప్రారంభమయ్యే నిరవధిక సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని జేఏసీ నాయకులు హెచ్చరించారు.
సమావేశంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకులు లకపాక రాజు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, నల్గొండ పట్టణ ఆటో జేఏసీ నాయకులు హనుమంతు నాయక్, పల్పరాజు యాదయ్య, కత్తుల చందు, రావుల వీరేశం, గుంటూరు సైదులు, ఎండీ సల్మాన్, వెంకన్న, బాబు మియా తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి