బెల్ట్ షాపుల నిర్మూలన దిశగా అడుగులు
రూ.50 వేల జరిమానాతో గ్రామ పంచాయతీల కఠిన తీర్మానాలు
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పిలుపుతో ఊపందుకున్న సామాజిక మార్పు
పల్లెల్లో మద్యపాన మహమ్మారిని అరికట్టి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు గ్రామ పంచాయతీలు నడుంబిగించాయి. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో చేపట్టిన బెల్ట్ షాపుల నిర్మూలన కార్యక్రమం ఇప్పుడు పొరుగు నియోజకవర్గాలకూ విస్తరిస్తోంది. గ్రామాల్లో బెల్ట్ షాపులను అరికట్టడంతో అక్కడ నేరాల సంఖ్య తగ్గి, ప్రశాంత వాతావరణం నెలకొందని వచ్చిన నివేదికలతో పలు గ్రామాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.
రాజగోపాల్ రెడ్డి నిర్ణయాల స్పూర్తితో నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండలం తాళ్ల వెల్లెంల, ఏపూర్, పెద్దకాపర్తి, పేరేపల్లి గ్రామ పంచాయతీలు బెల్ట్ షాపులను రద్దు చేస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. అదేబాటలో నల్గొండ నియోజకవర్గంలోని కనగల్ మండల కేంద్ర గ్రామపంచాయతీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహించకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.50,000 జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ పంచాయతీ పాలకవర్గం స్పష్టమైన తీర్మానం ఆమోదించింది. 2018లోనే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రాజగోపాల్ రెడ్డి గ్రామాల్లో బెల్ట్ షాపులను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మద్యం రహితంగా మారే గ్రామాలకు స్వయంగా అభివృద్ధి నిధులు అందిస్తానని ప్రకటించారు. నాటి సవాలును స్వీకరించి నారాయణపూర్ మండలం అల్లందేవిచెరువు సర్పంచ్ బెల్ట్ షాపులను మూసివేయించగా, తన మాతృమూర్తి ‘కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్’ ద్వారా రూ.6 లక్షల అభివృద్ధి నిధులను ఎమ్మెల్యే అందజేసి మాట నిలబెట్టుకున్నారు.2023లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడం, రాజగోపాల్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ నిర్ణయాన్ని నియోజకవర్గవ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్నారు. మునుగోడు పల్లెల్లో సత్ఫలితాలు ఇస్తున్న ఈ మార్పు, ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా ఇతర మండలాలకూ ఆదర్శంగా మారుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి