హైదరాబాద్: దివ్యాంగుల ఉద్యోగ నియామకాల్లో కీలక ముందడుగు పడింది. దివ్యాంగుల కోసం స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ జీవోను పునరుద్ధరించడంపై విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం తెలంగాణ రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపింది.
ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఫోరం ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక నియామక ప్రక్రియ పునరుద్ధరణతో ప్రభుత్వ శాఖల్లో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి మార్గం సుగమం కానుందని ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. వేలాది మంది దివ్యాంగ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలపై ఆశలు చిగురించాయని తెలిపారు.
కృషి చేసిన వారికి కృతజ్ఞతలు
స్పెషల్ డ్రైవ్ జీవో పునరుద్ధరణకు కృషి చేసిన మంత్రి అట్లూరి లక్ష్మణ్, మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్, ప్రస్తుత దివ్యాంగుల ప్రిన్సిపల్ సెక్రటరీ శృతి ఓజ, చెరుకు నాగభూషణం, పి. వెంకటేశ్వర్లులకు ఫోరం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దివ్యాంగుల సంక్షేమం, విద్య, ఉపాధి, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు. ప్రత్యేక నియామక ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసి పెండింగ్ బ్యాక్లాగ్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్, ఉపాధ్యక్షుడు డాక్టర్ కుర్షిత్ మియా, మహిళా అధ్యక్షురాలు ధనమ్మ, కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, శివ యాదవ్, అరవింద్తో పాటు దివ్యాంగ విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి