రామన్నపేట, ఆగస్టు 20: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులకు తక్షణమే నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 29, 30, 31 తేదీల్లో భువనగిరి నుంచి హైదరాబాద్ ఇందిరాపార్క్ వరకు నిర్వహించనున్న సీపీఎం పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను రామన్నపేటలో సీపీఎం నాయకులతో కలిసి ఆవిష్కరించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి దశాబ్దం పూర్తవుతున్నా ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న జిల్లాలో సాగునీటి వనరులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మూసీ నీటితో పంటలు.. ప్రజలకు అనారోగ్య ముప్పు
సాగునీరు అందుబాటులో లేక రైతులు కలుషితమైన మూసీ నీటిని పంటలకు వినియోగిస్తున్నారని, దీంతో భూములు, పంటలు కలుషితం కావడంతో పాటు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని జహంగీర్ అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
బస్వాపూర్, గంధమల్ల, చర్లగూడెం తదితర కీలక ప్రాజెక్టులకు నిధులు ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. రామన్నపేట ప్రాంతానికి కీలకమైన ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాలువల పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా రామన్నపేట మండలానికి గోదావరి జలాలను అందించి మూసీ నీటికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు.
పురాతనమైన ఆసిఫ్నగర్ కాలువను పునరుద్ధరించడంతో పాటు అర్ధాంతరంగా నిలిచిపోయిన కాలువల పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. జిల్లాలోని అన్ని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసి, కాలపరిమితితో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పాదయాత్రకు రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు ఇవ్వాలని జహంగీర్ కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యుడు వనం ఉపేందర్, కల్లూరి నగేష్, బావండ్లపల్లి బాలరాజు, నాగటి ఉపేందర్, తొలుపునూరి శ్రీనివాస్, అవనగంటి నగేష్, నీల అయిలయ్య, పల్లె సత్యం, దండిగ నర్సింహా, బావండ్లపల్లి సత్యం, శానగొండ వెంకటేశ్వర్లు, వళ్లమల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి