అలరించిన పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు
స్థానిక శ్రీ గాయత్రి జూనియర్, డిగ్రీ కళాశాలలో బోనాల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ప్రాంగణంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అలకరించిన బోనాలతో విద్యార్థినులు ఊరేగింపుగా తరలివచ్చారు. డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, విద్యార్థుల సాంప్రదాయ నృత్యాలతో కళాశాల పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బోనాలు ప్రకృతిని, శక్తిని పూజించే గొప్ప సంప్రదాయమని కొనియాడారు. విద్యార్థులు విద్యతో పాటు సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. వేడుకలను ప్రశాంత వాతావరణంలో, క్రమశిక్షణతో నిర్వహించిన యాజమాన్యాన్ని అభినందించారు. కళాశాల కరెస్పాండెంట్ భీమిడి సుభాష్ రెడ్డి, చైర్మన్ బండారు మయూరి రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులలో నైతిక విలువలు, పాశ్చాత్య ధోరణులను అధిగమించి సాంప్రదాయాల పట్ల గౌరవం పెంచేందుకే ఈ ఉత్సవాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ దయాకర్, ఆంజనేయులు, అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి