పంట పొలాలు, రైతుల జీవనోపాధికి ముప్పు.. తహసీల్దార్కు వినతిపత్రం.
చిట్యాల: మండలంలోని పెద్దకాపర్తి గ్రామ శివారు ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే రెడీమిక్స్ ప్లాంట్ ప్రతిపాదనను వెంటనే నిలిపివేయాలని కోరుతూ స్థానిక రైతులు తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ప్లాంట్ ఏర్పాటుతో పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు, రైతుల జీవనోపాధితో పాటు ప్రజల ఆరోగ్యం, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రెడీమిక్స్ ప్లాంట్ నుంచి వెలువడే సిమెంట్, ఇసుక, రాళ్ల దుమ్ముతో గాలి కాలుష్యం ఏర్పడి పంటలపై దుమ్ము పేరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో పంట దిగుబడులు తగ్గి సుమారు వంద మంది రైతుల ప్రత్యక్ష జీవనోపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అలాగే ప్లాంట్కు భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో గ్రామీణ రహదారులు దెబ్బతినడంతో పాటు ప్రజలు, విద్యార్థులు, రైతులకు ప్రమాదాల ముప్పు ఉంటుందని తెలిపారు. ప్లాంట్ నిర్వహణలో వెలువడే వ్యర్థాలు, మురుగునీరు వ్యవసాయ భూములు లేదా నీటి వనరుల్లోకి చేరితే నేల, నీటి నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కలెక్టర్ స్థాయిలో పరిశీలించాలి
రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని రైతులు కోరారు. పంట పొలాలకు, ప్రజల జీవనానికి ఎలాంటి నష్టం కలగకుండా సమగ్రంగా పరిశీలించిన అనంతరం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్లాంట్ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గంట్ల మహేందర్రెడ్డి, రవీందర్రెడ్డి, గుత్తా లవకుమార్, పున్న రాజు, యాదగిరి, విరమల్లు, లింగారెడ్డి, ముత్తయ్య, రాములు, రవి తదితర రైతులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి