రామన్నపేట, ఆగస్టు 21: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా అనుసరిస్తున్న ఏకపక్ష, అప్రజాస్వామిక, రాజకీయ పక్షపాత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన వెంటనే చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్యూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
రామన్నపేట కోర్టు ఆవరణలో శుక్రవారం న్యాయవాదులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీసీఐ ఏ రాజకీయ పార్టీకి, ప్రభుత్వానికి అనుబంధ సంస్థ కాదని, దేశంలోని న్యాయవాదులందరికీ ప్రాతినిధ్యం వహించే స్వతంత్ర చట్టబద్ధ సంస్థ అని పేర్కొన్నారు. బీసీఐ అధికారాన్ని వ్యక్తిగతంగా కేంద్రీకరించడం, అధికారిక పదవిని రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం సంస్థ స్వతంత్రత, విశ్వసనీయతను దెబ్బతీస్తుందని విమర్శించారు.
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్ పట్టభద్రులను న్యాయవాదులుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీ చేయడం ఏకపక్ష, చట్టవిరుద్ధ చర్యగా ఆయన అభివర్ణించారు. కొంతమంది విద్యార్థులు శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు మొత్తం బ్యాచ్ను శిక్షించడం రాజ్యాంగ విలువలకు, న్యాయవాదుల చట్టం–1961కు విరుద్ధమన్నారు. ఆదేశాలను అనంతరం ఉపసంహరించుకున్నప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన బాధ్యత నుంచి చైర్మన్ తప్పించుకోలేరన్నారు.
ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర బార్ కౌన్సిళ్ల స్వతంత్రతలో జోక్యం చేసుకోవడం, ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులను నామినేషన్ల ద్వారా అధికార స్థానాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించడం ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధమన్నారు. న్యాయ విద్య ప్రమాణాలు, న్యాయ కళాశాలల తనిఖీలు, అనుమతులకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బీసీఐ కోల్పోయిన గౌరవం, విశ్వసనీయత, ప్రజాస్వామిక స్వభావాన్ని పునరుద్ధరించేందుకు మనన్ కుమార్ మిశ్రా వెంటనే చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని మామిడి వెంకట్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎల్యూ జిల్లా ఉపాధ్యక్షుడు పాల్వంచ జగతయ్య, జిల్లా కమిటీ సభ్యులు యాదాసు యాదయ్య, గడ్డం నరసింహ, వీరమల్ల నర్సింహ, అంతటి రమేష్, అంకం నరేష్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి