చిట్యాల: నల్లగొండ జిల్లా మల్లేపల్లి మండల కేంద్రంలోని నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి రూపా రెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ చిట్యాల పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, పాఠశాలల సిబ్బంది, యాజమాన్యాలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్, మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
రూపా రెడ్డి హత్యను మండలంలోని పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దే పవిత్రమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులపై దాడులు జరగడం బాధాకరమన్నారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, ఇతర సిబ్బందికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
ఐదు ప్రధాన డిమాండ్లు.
రూపా రెడ్డి హత్యకు పాల్పడిన నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల వద్ద భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు యాజమాన్యాలు, ఉపాధ్యాయులపై బెదిరింపులు, దాడులు జరిగితే వెంటనే ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. ఉపాధ్యాయుల భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
‘ఉపాధ్యాయుల భద్రతే విద్యా వ్యవస్థకు భద్రత’ అనే భావనతో ప్రభుత్వం, అధికారులు ఈ అంశంపై తక్షణమే స్పందించాలని ట్రస్మా ప్రతినిధులు కోరారు.కార్యక్రమంలో ట్రస్మా మండల శాఖ అధ్యక్షుడు ఎండి జమీరుద్దీన్, నాయకులు గట్టు అలెగ్జాండర్ రెడ్డి, పెద్ది నరేందర్, ప్రకాష్, జె. వేణుగోపాల్ రెడ్డి, బొడిగె విజయ్, బొడిగె రవి తదితరులతో పాటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి