రామన్నపేట: కొండమల్లేపల్లి నాగార్జున పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య విద్యా వ్యవస్థకే మాయని మచ్చ అని రామన్నపేట మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
రూపారెడ్డి హత్యను నిరసిస్తూ శుక్రవారం మండల వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల బంద్ నిర్వహించారు. వివిధ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం నుంచి సుభాష్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం సుభాష్ సెంటర్లో ఏర్పాటు చేసిన రూపారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు కరెస్పాండెంట్లు మాట్లాడుతూ.. నేటి విద్యా వ్యవస్థలో కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ధోరణి ఆందోళనకరంగా మారుతోందని అన్నారు. సమాజ నిర్మాణంలో గురుతర బాధ్యత నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు రక్షణ లేకపోవడం విద్యా వ్యవస్థ మనుగడకే పెను ముప్పుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రూపారెడ్డి హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు టి. మల్లిఖార్జున్, జె. మార్టిన్, జి. నరేందర్రెడ్డి, కనకచారి, నాగరాజు, శ్రీధర్తో పాటు ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి