లోక్యతండలో ఇంటింటి పర్యటన.. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు
త్రిపురారం: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ త్రిపురారం మండలం లోక్యతండలో పర్యటించారు. గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ తీరుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామ పర్యటనలో భాగంగా కలెక్టర్ ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పింఛన్లు, తాగునీరు, ఇళ్లు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, విద్య తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం గ్రామంలో 43 పింఛన్లు ఉన్నాయని, మరో 13 పింఛన్లు మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు.
గ్రామంలో సుమారు 40 కుటుంబాలకు నల్లా కనెక్షన్లు లేవని గ్రామస్థులు కలెక్టర్కు వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన గ్రామంలోని నీటి సరఫరా లైన్ను పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గుడిసెలో నివసిస్తున్న ధనావత్ కృష్ణకుమారి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న కలెక్టర్, ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అందించే గృహ నిర్మాణ పథకాలు నిజమైన అర్హులకు చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
గ్రామంలో రెండు డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. పనులను వెంటనే ప్రారంభించి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామంలోని పాఠశాలకు కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్ నిర్మాణానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. విద్యార్థులకు సోమవారం నుంచి యూనిఫారాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
గ్రామంలో తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ వ్యవసాయంలో మెరుగైన ఫలితాలు సాధించాలని రైతులకు సూచించారు.
పరిశుభ్రతపై కూడా కలెక్టర్ ప్రజలకు అవగాహన కల్పించారు. డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. గ్రామ పారిశుద్ధ్యంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
“అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి” అని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పేర్కొన్నారు.
కార్యాలయాలకు పరిమితం కాకుండా కలెక్టర్ స్వయంగా గ్రామంలో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకోవడంపై లోక్యతండ గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వెంటనే పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి