హైదరాబాద్, ఆగస్టు 21
పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకం దేశ క్రీడారంగంలో పెనుమార్పులు తీసుకురానుందని రెండుసార్లు ఒలింపిక్స్లో పాల్గొన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత జ్వాలా గుత్తా అన్నారు. క్రీడాకారులను క్షేత్రస్థాయి నుంచే గుర్తించి ఉన్నత స్థాయికి తీర్చిదిద్దేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
2026–31 కాలానికి పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకానికి గతంలో కంటే ఎనిమిది రెట్లు పెంచి రూ.29,054 కోట్ల నిధులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. పథకం ద్వారా మద్దతు పొందే క్రీడాకారుల సంఖ్యను పది రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 30 క్రీడాంశాల్లో 10 వేల మంది ఖేలో ఇండియా అథ్లెట్లు, 20 వేల మంది వర్ధమాన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించనున్నట్లు వివరించారు.
హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జ్వాలా గుత్తా మాట్లాడుతూ.. తాను కూడా ప్రభుత్వ సహకారంతోనే క్రీడాకారిణిగా ఎదిగానని తెలిపారు. ప్రభుత్వ మద్దతు లేకుండా తాను సాధించిన విజయాలు సాధ్యమయ్యేవి కాదన్నారు. కొత్త రూపంలోని ఖేలో ఇండియా పథకం ఎంతో ఆశాజనకంగా ఉందని, క్షేత్రస్థాయి నుంచే క్రీడా ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేయడం మంచి పరిణామమన్నారు.
తెలంగాణలో ఇప్పటికే 33 ఖేలో ఇండియా కేంద్రాలను మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. మేడ్చల్–మల్కాజ్గిరిలోని ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రోయింగ్, వెయిట్లిఫ్టింగ్, ఫెన్సింగ్ తదితర క్రీడల్లో 254 మంది క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహం అందుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 19 ఖేలో ఇండియా గుర్తింపు పొందిన అకాడమీలను ఏర్పాటు చేసేందుకు నోటిఫై చేసినట్లు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో క్రీడాకారులను కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీర్చిదిద్దేలా పథకాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్పర్సన్, ఎండీ డాక్టర్ ఏ. సోనిబాలా దేవి, భారత క్రీడా ప్రాధికార సంస్థ బెంగళూరు ప్రాంతీయ డైరెక్టర్ విష్ణు సుధాకరన్, డిప్యూటీ డైరెక్టర్ ఎస్. హిమబిందు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి