చోరీని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిలింగ్.. బంగారం తాకట్టు పెట్టించి మరీ వసూళ్లా?
చండూరు: మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డులో ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం భారీగా చోరీకి గురైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ధాన్యం చోరీ వ్యవహారాన్ని కొందరు యువకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లకుండా తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
మార్కెట్ యార్డులో ధాన్యం మాయమవుతున్న విషయాన్ని గుర్తించిన కొందరు యువకులు.. చోరీకి పాల్పడిన వ్యక్తిని బెదిరించి, ఈ విషయాన్ని బయటకు రానీయకుండా ఉండేందుకు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సదరు వ్యక్తి తన వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి మరీ డబ్బులు చెల్లించినట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.అయితే అసలు ఎంత మొత్తంలో ప్రభుత్వ ధాన్యం మాయమైంది? చోరీ వెనుక ఒక్కరే ఉన్నారా? మరికొందరి ప్రమేయం ఉందా? ప్రభుత్వ ఆస్తి చోరీ విషయం తెలిసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, దానిని అడ్డుపెట్టుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణల్లో వాస్తవమెంత? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.చోరీ ఒక నేరమైతే.. దాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం మరో నేరం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సమగ్రంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి ప్రభుత్వ ధాన్యం చోరీకి పాల్పడిన వారితో పాటు, చోరీ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపైనా విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.
దర్యాప్తుతోనే నిజాలు వెలుగులోకి రావాలిమార్కెట్ యార్డులో ప్రభుత్వ ధాన్యం భద్రత, పర్యవేక్షణలో లోపాలు ఏమైనా ఉన్నాయా? చోరీ ఎంతకాలంగా కొనసాగుతోంది? ఇందులో అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణాల్లోనూ అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. సమగ్ర దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి