హైదరాబాద్: సెల్ఫోన్లు చోరీ చేసి వాటిలోని వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఉపయోగించి ఖాతాలను ఖాళీ చేస్తున్న ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’ ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సూచించారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న వారిని ఈ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని తెలిపారు.
రద్దీగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్సులు, బహిరంగ ప్రదేశాల్లో స్మార్ట్ఫోన్ వినియోగించే వారిని నిందితులు ముందుగా గమనిస్తున్నారు. వారు ఫోన్ అన్లాక్ చేసే సమయంలో పిన్, ప్యాటర్న్ లేదా పాస్వర్డ్ను గమనించి, అదును చూసి మొబైల్ను చోరీ చేస్తున్నారు.
ఫోన్ లాక్ అయి ఉంటే బాధితులకు ఫోన్ చేసి తాము కండక్టర్, డ్రైవర్ అని లేదా ఫోన్ దొరికిందని నమ్మించి స్క్రీన్ లాక్ పాస్వర్డ్ను చెప్పించుకుంటున్నారు. అనంతరం ఫోన్లోని గ్యాలరీ, నోట్స్, మెసేజ్లు, వాట్సాప్లో ఉన్న బ్యాంక్ ఖాతాలు, కార్డులు, ఆధార్, పాన్ తదితర వివరాలను సేకరిస్తున్నారు.
సిమ్ కార్డు కూడా నిందితుల వద్ద ఉండటంతో ఓటీపీలను ఉపయోగించి యూపీఐ, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు, పిన్లను రీసెట్ చేసి ఖాతాల్లోని నగదును ఇతర ఖాతాలకు బదిలీ చేస్తున్నారని సీపీ తెలిపారు. ఈ డబ్బును ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారమ్లు, డిజిటల్ వాలెట్లు, మ్యూల్ అకౌంట్ల ద్వారా మళ్లిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని సీపీ తెలిపారు.
ఫోన్ పోయిన వెంటనే సిమ్ను బ్లాక్ చేయించడంతో పాటు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. అలాగే CEIR పోర్టల్లో ఐఎంఈఐ నంబర్ ద్వారా ఫోన్ను బ్లాక్ చేయించాలన్నారు. ఖాతా నుంచి నగదు మాయం అయితే వెంటనే 1930కు ఫోన్ చేయాలని, సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనర్ సూచించారు.
ముఖ్యంగా.. మొబైల్ స్క్రీన్ లాక్ పిన్, పాస్వర్డ్, ఓటీపీ, యూపీఐ పిన్, సీవీవీ వంటి వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పొద్దని సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి