ప్రమాదాల నివారణకు జాతీయ రహదారి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ కీలక నిర్ణయం...
నల్గొండ : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు హైవే పెట్రోలింగ్ పెంపుతో పాటు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా స్థాయి జాతీయ రహదారి టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ టి.ప్రేమ్కరణ్రెడ్డి అధ్యక్షతన గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇటీవల సూర్యాపేట జిల్లా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంతో పాటు, జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలపై ఈ సందర్భంగా సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారి ప్రమాదాల నివారణకు వాహనదారులు, డ్రైవర్లలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు, జారీ చేసిన ఆదేశాలు ఇవీ...జాతీయ రహదారికి ఇరువైపులా నిబంధనలకు విరుద్ధంగా వెలసిన దాబాలు, హోటళ్లు, పంక్చర్ షాపులు, పాన్ డబ్బాలను తక్షణమే దూరంగా జరపాలి. నోటీసులకు స్పందించకపోతే క్రేన్ల సహాయంతో ఆక్రమణలను తొలగించాలి. ప్రమాదాలు జరిగిన వెంటనే బాధితులను ఆదుకునేందుకు ప్రతి 30 నుంచి 40 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్, క్రేన్ను అందుబాటులో ఉంచాలి. సమాచారం అందిన వెంటనే పోలీస్, హైవే పెట్రోలింగ్, వైద్య ఆరోగ్య శాఖల సిబ్బంది సమన్వయంతో స్పందించాలి.
వేగ నియంత్రణ, డ్రైవర్లకు విరామం..
నిరంతరం డ్రైవింగ్ చేయడం వల్లే ఉదయం వేళల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి డ్రైవర్లు ప్రతి రెండు గంటలకొకసారి వాహనాన్ని నిలిపి విశ్రాంతి తీసుకునేలా అవగాహన కల్పించాలి. వాహనాల వేగం గంటకు 80 కిలోమీటర్లు మించకుండా చర్యలు తీసుకోవాలి. లారీలు, ట్రక్కులను కేవలం కేటాయించిన 'ట్రక్ లే-బేస్'లలో మాత్రమే నిలపాలి. నో-పార్కింగ్ జోన్లలో వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తప్పవు. ఒకవేళ వాహనం చెడిపోతే తక్షణమే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. సర్వీసు రోడ్ల నుంచి ప్రధాన రహదారిని కలిసే ప్రాంతాలు, ప్రమాదకరమైన మలుపుల వద్ద స్పష్టమైన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి.
1033 పై విస్తృత ప్రచారం...
డిప్యూటీ రవాణా కమిషనర్ (డీటీసీ) వాణి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సీటు బెల్టు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారి అత్యవసర సహాయక సంఖ్య '1033'పై విస్తృత ప్రచారం నిర్వహించాలని, పెట్రోలింగ్ పెంచి నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) దశరథ్తో పాటు రహదారులు-భవనాలు (ఆర్అండ్బీ), జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ), వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి