రామన్నపేట: రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రామన్నపేట ఎస్ఐ గోపాతి సతీష్ సూచించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రామన్నపేటలో రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, పిల్లల మొబైల్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ గోపాతి సతీష్ మాట్లాడుతూ.. “హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా ఇంటికి చేరండి” అని వాహనదారులకు సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
సెల్ఫోన్తో డ్రైవింగ్ వద్దు
వాహనం నడిపే సమయంలో సెల్ఫోన్ వినియోగం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్కు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించడంతో పాటు విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు.
సైబర్ మోసాలపై జాగ్రత్త
ఆన్లైన్ మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోపాతి సతీష్ సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లు చెప్పొద్దని తెలిపారు. అనుమానాస్పద లింకులు, మెసేజ్లు, ఫోన్కాల్స్కు స్పందించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పిల్లల మొబైల్ వాడకంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ
పిల్లలు మొబైల్ ఫోన్లను వినియోగించే విధానంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్ఐ తెలిపారు. పిల్లలు ఆన్లైన్లో ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రోడ్డు భద్రతతో పాటు సైబర్ భద్రత కూడా ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకోవాలని ఎస్ఐ గోపాతి సతీష్ పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి