విద్యాబోధన, పరిశోధనల్లో ప్రతిభకు దక్కిన అరుదైన గుర్తింపు.
నల్గొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలకు మరో అరుదైన ఘనత దక్కింది. కళాశాలకు చెందిన ఆర్థికశాస్త్ర అధ్యాపకులు డా. డి. మునిస్వామి, సూక్ష్మజీవ శాస్త్ర అధ్యాపకులు బత్తిని నాగరాజు రాష్ట్ర స్థాయి ‘ఉత్తమ అధ్యాపకులు’ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందజేశారు.
విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్యాబోధన, నూతన బోధనా పద్ధతుల అమలు, పరిశోధనలతో పాటు ఉత్తమ విద్యా ఫలితాల సాధనలో వారు అందించిన సేవలను గుర్తించి ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు.
స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం.
రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారాలు అందుకున్న డా. మునిస్వామి, బత్తిని నాగరాజులను కళాశాల స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ.. తమకు లభించిన ఈ గౌరవం కళాశాల యాజమాన్యం ప్రోత్సాహం, తోటి అధ్యాపకులు, విద్యార్థుల సహకారంతోనే సాధ్యమైందన్నారు. ఈ పురస్కారం తమపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం మరింత అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్, డా. అంతటి శ్రీనివాసులు, స్టాఫ్ క్లబ్ కార్యదర్శి సుధాకర్తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొని అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి