ఎర్రుపాలెం: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో పేరుకే పరిమితమవుతోందని సీపీఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు విమర్శించారు. సోమవారం ఎర్రుపాలెం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో సీపీఎం ఆధ్వర్యంలో పలు సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభాకరరావు మాట్లాడుతూ.. ప్రజావాణికి హాజరయ్యే కొందరు అధికారులు సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని, మరికొన్ని శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమానికి హాజరు కావడం లేదని ఆరోపించారు. భూ సమస్యలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, విద్య, వైద్యం, మైనింగ్ తదితర సమస్యలపై ప్రజలు దరఖాస్తులు చేసుకుంటున్నా సకాలంలో పరిష్కారం లభించడం లేదన్నారు. ప్రజావాణి వెబ్పోర్టల్ ఉన్నప్పటికీ దరఖాస్తుదారులకు రసీదులు ఇవ్వకపోవడంతో తమ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియక ప్రజలు నిరాశకు గురవుతున్నారని అన్నారు.
మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ను వెంటనే అరికట్టి, నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడులతో, వేగంగా వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త గోపవరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర డ్వాక్రా గ్రూపులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, మీనవోలు గ్రామంలోని డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరారు. పెద్దగోపవరం, రేమిడిచర్ల ప్రాంతాల్లోని భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు హాజరై ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని, సమస్యలు పరిష్కరించకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో గొబ్బూరి కృష్ణంరాజు, షేక్ గాలి సాహెబ్, ధర్మయ్య, చిరంజీవి, ఉన్నం శ్రీనివాసరావు, నక్కా పుల్లారావు, కృష్ణ, మురళి, షేక్ బేబీ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి