ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ డేలో వినతులు.. చిట్యాల ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలని డిమాండ్.
చిట్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ప్రజా సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు చిట్యాల పట్టణ బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిట్యాల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రతరమవుతున్నాయని నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల బండారు జనార్ధన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ.. మరిన్ని ప్రమాదాలు జరగకుండా ఫ్లైఓవర్ పనులను వెంటనే వేగవంతం చేయాలని కోరారు.
అలాగే పట్టణంలో పారిశుద్ధ్యం, మరుగుకాలువల సమస్యలను పరిష్కరించాలని, 10వ వార్డులో ఓపెన్ డ్రైనేజీపై స్లాబ్ నిర్మించాలని, మేడం పండు కాలనీలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించాలని, పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని, యూరియా కొరత లేకుండా రైతులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ రూ.4,016 అందించాలని, వంటగ్యాస్ సిలిండర్ను రూ.500కే అందించడంతో పాటు మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, జమాండ్ల శ్రీనివాస్రెడ్డి, బొబ్బలి శివశంకర్రెడ్డి, 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనుగోటి శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ షబానా అజీమ్ .రాచకొండ కృష్ణయ్య, సుర్కంటి నర్సిరెడ్డి, సాయిరెడ్డి, ప్రతాపరెడ్డి, నాలావత్ కృష్ణనాయక్, చెరుకు బాలకృష్ణ, ఉప్పలపల్లి నాగేష్, తోటకూరి అనిల్, జమాండ్ల చందురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి