చైతన్యపురి:
దేశభక్తి, సేవా స్ఫూర్తితో చైతన్యపురి పోలీస్స్టేషన్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కె. సైదులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా సీఐ సైదులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కేవలం హక్కు మాత్రమే కాదని, దాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన కర్తవ్యమని, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలు పోలీసులను చూసి భయపడాల్సిన అవసరం లేదని, సమస్యలు ఎదురైనప్పుడు ముందుగా పోలీసులను ఆశ్రయించేలా ప్రజల్లో నమ్మకం కల్పించాలని సిబ్బందికి సూచించారు.
మహిళలు, బాలికలు, చిన్నారులు, వృద్ధులు, బలహీన వర్గాల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.
అనంతరం ‘దేశ రక్షణ–ప్రజల భద్రత–చట్ట పరిరక్షణ’ అనే బాధ్యతను మరింత నిబద్ధతతో నిర్వర్తిస్తామని పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో చైతన్యపురి పోలీస్స్టేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశభక్తి, ఐక్యత, సేవా స్ఫూర్తితో వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి