రూ.2 వేల కోట్లతో నల్గొండ పట్టణాభివృద్ధి..
రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్..
లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున సొంత నిధుల సహాయం: మంత్రి కోమటిరెడ్డి..
నల్గొండ : పేదల చిరకాల స్వప్నమైన సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శనివారం నల్గొండలోని గొల్లగూడ ప్రాంతంలో రూ.36 కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 552 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించి, ఇంటి కేటాయింపు ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు...
గృహప్రవేశం చేసిన 552 కుటుంబాలకు వారి ఇంటి అవసరాల నిమిత్తం తన సొంత నిధుల నుంచి ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లకు మరమ్మతులు చేయించి, సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలను కల్పించామన్నారు. ఈ సముదాయంలో ప్రజలకు అందుబాటులో రేషన్ షాపు, సూపర్ బజార్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నల్గొండ పట్టణాన్ని రూ.2,000 కోట్లతో సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పనులు జరుగుతున్నాయని, మిగిలిన నిధులతో రోడ్లు, డ్రైన్లు, తాగునీటి వసతులు కల్పిస్తామని, రాబోయే రెండున్నర ఏళ్లలో ఈ పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. ఇండ్లు రాని అర్హులైన పేదలకు 75 గజాల స్థలం కేటాయించి, రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు తిప్పర్తి–మునుగోడు, మిర్యాలగూడ, దుప్పలపల్లి, దేవరకొండ రోడ్లలో స్థలాలను పరిశీలించినట్లు చెప్పారు. అర్హులు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నల్గొండ సమీపంలోని ఎస్ఎల్బీసీ వద్ద రూ.200 కోట్లతో 2,500 మంది విద్యార్థుల సామర్థ్యంతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఎంపీ నిధులతో ఓపెన్ జిమ్..
నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి ప్రత్యేక శ్రద్ధతో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించడం అభినందనీయమన్నారు. ఎంపీ నిధుల నుంచి ఈ నివాస ప్రాంతంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 6 ఎకరాల విస్తీర్ణంలో 24 బ్లాకుల్లో 552 ఇళ్లను నిర్మించి మౌలిక వసతులతో లబ్ధిదారులకు అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీవో అశోక్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి