తెలంగాణ సాధనకు జయశంకర్ సార్ అందించిన సిద్ధాంతపరమైన సేవలు చిరస్మరణీయం – ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్
నల్గొండ: తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపితగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ కె. జయశంకర్ సార్ జయంతి వేడుకలను నల్గొండలోని ఎన్జీ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాత్ర అపూర్వమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమాన్ని మూడు దశల్లో ముందుకు నడిపించారని, మొదటి దశలో తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో విస్తరించారని, రెండో దశలో ఉద్యమ ప్రచారాన్ని బలోపేతం చేశారని, మూడో దశలో రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు.
జయశంకర్ సార్ జీవితంలో కూడా మూడు కీలక దశలు ఉన్నాయని ఆయన వివరించారు. విద్యార్థి దశలో తెలంగాణ ఉద్యమ కార్యకర్తగా, ఉద్యోగ జీవితంలో ఉద్యోగుల సమస్యలతో పాటు తెలంగాణ ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ పోరాడారని, పదవీ విరమణ అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా నిరంతరం కృషి చేశారని తెలిపారు. 2011 జూన్ 21న ఆయన కన్నుమూయడం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోవడం రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ తత్వవేత్త, తెలంగాణ జాతిపితగా ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు నర్సింగ్ కోటయ్య, ఎం. వెంకటరెడ్డి, కె. శివరాణి, డాక్టర్ ఆదే మల్లేశం, ఎం. సావిత్రి, హబీబ్, దినేష్, అంకుష్, స్రవంతి తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని జయశంకర్ సార్కు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి