ఇన్-సర్వీస్ బీఎస్సీ (అగ్రికల్చర్) ప్రవేశాల్లో పాత విధానాన్ని కొనసాగించి, 5 శాతం ఇన్-సర్వీస్ కోటాను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా వ్యవసాయ
విస్తరణాధికారుల (ఏఈఓ) సంఘం ప్రతినిధులు గురువారం జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ)కి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర సెంట్రల్ ఫోరం పిలుపు మేరకు ఈ వినతిపత్రాన్ని సమర్పించినట్లు సంఘ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జీవో ఎంఎస్ నెం.250 (06-10-2009) స్ఫూర్తికి అనుగుణంగా డిప్లొమా అర్హత కలిగిన ఏఈఓలకు ఇన్-సర్వీస్ బీఎస్సీ (అగ్రి)లో సీనియారిటీ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పించాలని కోరారు.
ప్రస్తుతం అమలవుతున్న విధానం కారణంగా సీనియర్ ఏఈఓలు అవకాశాలు కోల్పోతున్నారని, దీంతో జీవో–250 ఉద్దేశం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత విద్యా సంవత్సరంలో 31 మంది ఏఈఓలకు అవకాశం కల్పించగా, ఈ ఏడాది కేవలం 19 సీట్లు మాత్రమే కేటాయించడం వల్ల అర్హులైన పలువురు నష్టపోతున్నారని పేర్కొన్నారు.
అందువల్ల పాత విధానాన్ని పునరుద్ధరించి, సీనియారిటీ ఆధారంగా ఎంపికలు చేపట్టడంతో పాటు 5 శాతం ఇన్-సర్వీస్ కోటాను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఏఈఓల సేవా ప్రయోజనాలు, విద్యా అవకాశాలు, ఉద్యోగోన్నతి అవకాశాలకు ప్రతికూలంగా ఉన్న జీవో ఎంఎస్ నెం.39ను వెంటనే రద్దు చేయాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అనుబంధ సంఘం టీఏఈఓఏ జిల్లా అధ్యక్షుడు పెద్దపంగ ప్రణయ్, జిల్లా కార్యదర్శి డి. మనోజ్ కుమార్, జిల్లా ట్రెజరర్ షేక్ ముస్తఫా, రాష్ట్ర సెంట్రల్ ఫోరం ఆర్గనైజింగ్ సెక్రటరీ కోడి మురళి, ఏఈఓలు శ్రీను, శైలజ, వెంకటేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి