మేడ్చల్: విద్యార్థుల్లో పఠన అలవాటును పెంపొందించి, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. సుధర్శన్రావు అన్నారు. హైదరాబాదు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (హితం)లో జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
భారత గ్రంథాలయ శాస్త్ర పితామహుడు పద్మశ్రీ డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ 134వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా Read n Read A to Z Book World సహకారంతో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సుధర్శన్రావు మాట్లాడుతూ విద్యార్థుల మేధో వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా పరిశోధనా పత్రాలు, జర్నల్స్, సాహిత్యం, ఇతర విజ్ఞాన వనరులను అధ్యయనం చేయాలని సూచించారు.
హితం డైరెక్టర్ డాక్టర్ జి. విశ్వనాథ్ మాట్లాడుతూ గ్రంథాలయాలు కేవలం పుస్తకాలను భద్రపరిచే ప్రదేశాలు కాకుండా జ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారాయని అన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. అరవింద్ మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ముద్రిత పుస్తకాలతో పాటు డిజిటల్ వనరులను కూడా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, సిబ్బందికి బెస్ట్ లైబ్రరీ యూజర్ అవార్డులు అందజేశారు. సమీపంలోని సెయింట్ క్లారెట్ పాఠశాల విద్యార్థులకు పుస్తక ప్రదర్శనను సందర్శించే అవకాశం కల్పించారు. చిన్నారుల్లో చిన్న వయసు నుంచే పఠన అలవాటును పెంపొందించేందుకు తల్లిదండ్రులు, విద్యాసంస్థలు కలిసి కృషి చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ జి. విశ్వనాథ్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. అరవింద్, గ్రంథాలయ బృంద సభ్యులు డాక్టర్ ఇ. రమేష్, పి. నారాయణరావు, టి. కవిత, ఆరోగ్యం, లైబ్రరీ కమిటీ కన్వీనర్ డాక్టర్ జి. అపర్ణ, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి