రాఖీ పండుగ వేళ ఏపూర్ డీఈసీ కంపెనీలో విషాదం.. గోబర్ గ్యాస్ గుంతలో పడి రెండేళ్ల బాలుడి మృతి.
కంపెనీ భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు.. ప్రమాదకర గుంతల చుట్టూ రక్షణ చర్యలు ఉన్నాయా?
చిట్యాల:
అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చిన ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. రాఖీ పండుగ సందర్భంగా అన్నను కలిసేందుకు వచ్చిన ఓ మహిళ.. చివరకు తన రెండేళ్ల కుమారుడిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ విషాద ఘటన చిట్యాల మండలం ఏపూర్ గ్రామ పరిధిలోని డీఈసీ కంపెనీలో శుక్రవారం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన రాజేష్కుమార్ కొంతకాలంగా డీఈసీ కంపెనీలో పనిచేస్తున్నాడు. రాఖీ పండుగ సందర్భంగా అతడి సోదరి, ఆమె భర్త అజయ్ పండిట్, కుమారుడు ఆర్యన్ కుమార్ (2)తో కలిసి కంపెనీకి వచ్చారు.
కనిపించకుండా పోయి.. చివరకు గుంతలో.
శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో చిన్నారి ఆర్యన్ ఇంటి నుంచి బయటకు వెళ్లి కంపెనీ పరిసరాల్లోకి వెళ్లాడు. కొంతసేపటి తర్వాత బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కంపెనీ పరిసరాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా బాలుడి ఆచూకీ లభించలేదు.ఈ క్రమంలో మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత కంపెనీ పరిసరాల్లోని గోబర్ గ్యాస్ గుంతలో బాలుడు పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బయటకు తీసినప్పటికీ అప్పటికే బాలుడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రాఖీ పండుగ రోజున చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
భద్రతా ఏర్పాట్లు ఎక్కడ?
కంపెనీ పరిసరాల్లో ప్రమాదకరమైన గుంతలు ఉన్నప్పటికీ.. రెండేళ్ల చిన్నారి అక్కడికి వెళ్లే పరిస్థితి ఎలా ఏర్పడిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్నారులు కంపెనీ పరిసరాల్లోకి వెళ్లకుండా ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు?
ప్రమాదకర గుంతలకు రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారా? అనే అంశాలపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
బాలుడి మృతికి దారితీసిన పరిస్థితులపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, కంపెనీ పరిసరాల్లో భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి