చిట్యాల, ఆగస్టు 29:
‘సే నో టు డ్రగ్స్ – సే నో టు గంజాయి’ నినాదంతో యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వరకు పాదయాత్ర చేపడుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమ్రాన్ ప్రిన్స్, ఆయన బృందాన్ని డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ అభినందించింది. శనివారం చిట్యాల మండలం వేలిమినేడు గ్రామం సమీపంలోని జాతీయ రహదారి వద్ద పాదయాత్ర బృందాన్ని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా మల్లం మహేష్ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత ఆకర్షితులు కాకుండా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి క్రీడలు, విద్య, ఉపాధి, సామాజిక కార్యక్రమాల వైపు నడిపించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.
గంజాయి, డ్రగ్స్కు వ్యతిరేకంగా డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇప్పటికే సైకిల్ యాత్రలు, అవగాహన సదస్సులు, క్రీడా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. యువత ఆరోగ్యకరమైన జీవన విధానం వైపు నడిచేలా మరిన్ని కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
అదేవిధంగా గంజాయి, డ్రగ్స్కు వ్యతిరేకంగా రూపొందించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్’ సినిమాను అభినందించారు. సమాజంలోని వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తూ యువతకు సందేశం ఇచ్చే సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. దసరా సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి కూనూరు గణేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు మేడి మనోజ్, కూరాకుల శివశంకర్, నాయకులు నూతనకంటి లింగస్వామి, దండు వివేక్, శివ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి