ఇరువర్గాల మధ్య ఘర్షణలో తండా వాసుల మృతి.. అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్ఐపై రాళ్ల దాడి.
మేళ్లచెరువు: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండాలో వేపచెట్టు విషయంలో తలెత్తిన వివాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న వేపచెట్టు వివాదం శనివారం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో అమరబోయిన వెంకటేశ్వర్లు, భూక్య సైదా దారుణ హత్యకు గురయ్యారు.
స్థానికుల సమాచారం ప్రకారం.. వేపచెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో భూక్య రాము గొడ్డలితో అమరబోయిన వెంకటేశ్వర్లుపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అనంతరం తన తండ్రి భూక్య సైదాపైనా గొడ్డలితో దాడి చేయడంతో ఆయన కూడా మృతిచెందినట్లు తెలుస్తోంది.
అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్ఐపై దాడి
ఘటన సమాచారం అందుకున్న మేళ్లచెరువు ఎస్ఐ నవీన్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే క్రమంలో ఎస్ఐపై కూడా రాళ్లతో దాడి జరగడంతో ఆయన తలకు గాయమైంది. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘర్షణలో పాల్గొన్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. తండాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి