హైదరాబాద్: డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్తిస్థాయి డిజిటల్ యూనివర్సిటీగా రూపాంతరం చెందుతోందని వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి తెలిపారు. యూనివర్సిటీ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఉన్నత విద్యను అందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతికత, ఆన్లైన్ విద్య, కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ‘ఏఐ ఫర్ టీచర్స్’ కోర్సులో శిక్షణ ప్రారంభించామని వెల్లడించారు. డిజిటల్, ఆన్లైన్ విధానంలో కోర్సులు నిర్వహించేందుకు యూజీసీ అనుమతి లభించిందన్నారు.
ఏఐతో విద్య మరింత సులభం
కామన్వెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా (సెమ్కా–న్యూఢిల్లీ) డైరెక్టర్ డా.బి.శడ్రక్ మాట్లాడుతూ.. ఏఐ ఆధారిత స్వీయ అభ్యసనతో విద్యార్థులకు మరింత సౌలభ్యం కలుగుతుందన్నారు. రైతులు, గృహిణులు, ఉద్యోగులు తమ రోజువారీ బాధ్యతలను నిర్వహించుకుంటూనే విద్యను కొనసాగించవచ్చని తెలిపారు. డిజిటల్ సాంకేతికతతో భౌగోళిక, సామాజిక పరిమితులను అధిగమించి నాణ్యమైన విద్యను విస్తృతంగా అందించవచ్చన్నారు.
కార్యక్రమానికి అకాడమిక్ డైరెక్టర్ ప్రొ.జి.పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించారు. రిజిస్ట్రార్ డా.ఎల్.విజయ కృష్ణారెడ్డి, పలువురు అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి