ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
డా. సుర్కంటి శ్రీధర్ రెడ్డి
మునుగోడులో బీఆర్ఎస్ ధర్నా..
ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన ఏ ఒక్క పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేక ఘోరంగా విఫలమైందని యాదాద్రి భువనగిరి జిల్లా ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, మందోళ్లగూడెం ఉపసర్పంచ్ డా. సుర్కంటి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన మునుగోడు పట్టణంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుబంధు, రైతు రుణమాఫీ, యూరియా కొరత, పింఛన్ల చెల్లింపుల్లో అలసత్వం వల్ల రాష్ట్రంలోని రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చాక సాగిస్తున్న పాలనకు అసలు పొంతనే లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని వెంటనే నెరవేర్చాలని, దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మానే రవికుమార్, మాజీ సర్పంచ్ బక్క శంకరయ్య, మాజీ ఉపసర్పంచ్ బోరం ప్రకాష్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఇట్టబోయిన శంకరయ్య, పాపగల రామచంద్రం, కళ్లెం రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి