నా కూతురు మాట్లాడినందుకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు.. పదేళ్లు సీఎంగా ఉంటానని ఆయన ఎలా చెబుతారు?
టికెట్ ఎవరికి ఇవ్వాలో సీఎం ఎలా నిర్ణయిస్తారు?
ఢిల్లీ: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవద్దని ఆమె కోరారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చెబుతున్నారని పేర్కొన్నారు.తనపై చర్యలు తీసుకోవాలనుకుంటే ముందుగా సీఎం రేవంత్రెడ్డిపైనే చర్యలు తీసుకోవాలని సురేఖ అన్నారు. ‘‘పదేళ్లపాటు నేనే సీఎంగా ఉంటానని రేవంత్రెడ్డి అంటున్నారు. అది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు రాదా?’’ అని ప్రశ్నించారు.తన కుమార్తెను రెచ్చగొట్టినందుకే ఆమె రేవంత్రెడ్డిపై విమర్శలు చేసిందని సురేఖ పేర్కొన్నారు. కుమార్తె చేసిన వ్యాఖ్యలను తనకు ఆపాదించడం సరికాదన్నారు. మహిళలకు స్వతంత్రంగా మాట్లాడే, జీవించే హక్కు ఉండాలని రాహుల్గాంధీ చెబుతున్నారని గుర్తుచేశారు.
టికెట్పై సీఎం ఎలా హామీ ఇస్తారు?
తదుపరి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది సీఎం రేవంత్రెడ్డి ఎలా నిర్ణయిస్తారని కొండా సురేఖ ప్రశ్నించారు. ‘‘ఏ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలో సీఎం ముందుగానే ఎలా ప్రకటిస్తారు? బహిరంగంగా హామీ ఇచ్చే హక్కు సీఎంకు ఏముంది?’’ అని నిలదీశారు.పార్టీలో క్రమశిక్షణ అందరికీ సమానంగా ఉండాలని, ఒకరి విషయంలో ఒక రకంగా.. మరొకరి విషయంలో మరో రకంగా వ్యవహరించడం సరికాదని ఆమె వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
కాగా, కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సురేఖ ఇప్పటికే కమిటీకి వివరణ ఇచ్చినట్లు సమాచారం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి