ఇన్స్పెక్షన్ల పేరుతో ఇబ్బందులు ఆపాలి.. రైస్ మిల్లర్ల ఆవేదన.
నల్లగొండ: బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే బకాయిలు లేని మిల్లర్లను ఇన్స్పెక్షన్ల పేరుతో వేధించడం సరికాదని నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. రాష్ట్రానికి రైతు ఒక కన్నయితే.. రైస్ మిల్లర్ మరో కన్ను అని పేర్కొన్నారు.ఆగస్టు 28 నుంచి బాయిల్డ్ రైస్ తీసుకోకుండా CMR నిలిపివేయడంతో మిల్లుల్లో బియ్యం నిల్వలు పేరుకుపోయాయని తెలిపారు. ఇప్పటికే ఐదు రోజులుగా మిల్లులు మూతపడ్డాయని, నెలరోజులు పరిస్థితి ఇలాగే ఉంటే ఒక్కో మిల్లుపై రూ.15–20 లక్షల వరకు నిర్వహణ భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్ బదులు రా రైస్ ఇవ్వాలని అకస్మాత్తుగా నిర్ణయించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కనీసం వారం రోజుల ముందే సమాచారం ఇవ్వాలని కోరారు.
రా రైస్ ఇవ్వలేని పరిస్థితిలో ధాన్యాన్ని ప్రభుత్వమే తీసుకుని తమ ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సమస్య పరిష్కారమయ్యే వరకు కొత్త ధాన్యం కేటాయించవద్దని, వచ్చే వానాకాలం ధాన్యాన్ని ప్రభుత్వ గిడ్డంగుల్లోనే నిల్వ చేసి టెస్ట్ మిల్లింగ్ అనంతరం కేటాయించాలని కోరారు.
మిల్లింగ్, రవాణా, డ్రేజీ, కస్టోడియన్ చార్జీలు ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని, 10, 20 రూపాయల వర్కింగ్ చార్జీలు 40 ఏళ్లుగా మారలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న మిల్లింగ్ చార్జీలను ఇక్కడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీ బస్తాల వల్ల నష్టం జరుగుతోందని, వాటి లెక్కలు కూడా తేల్చాలని కోరారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము మాట్లాడటం లేదని, మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలన్నదే తమ విజ్ఞప్తి అని అసోసియేషన్ స్పష్టం చేసింది. రైతు–మిల్లర్ కలిసి నడిస్తేనే వ్యవసాయ రంగం, రాష్ట్రం బలోపేతమవుతుందని పేర్కొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి