వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
Editor Desk
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని సంఘం మండల ప్రధాన కార్యదర్శి గామాసు జోగయ్య పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య భవనంలో మంగళవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం సంఘం అధ్యక్షుడు నాగులవంచ వెంకటరామయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా గామాసు జోగయ్య మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కూలి పనిపై ఆధారపడే కుటుంబాలు పౌష్టికాహారం అందక రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు అధికమై కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగాయని పేర్కొన్నారు. దీంతో ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని అన్నారు. వ్యవసాయ కూలీలు, పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం రాష్ట్ర మహాసభల ప్రచారంలో భాగంగా వెంకటాపురం గ్రామంలో తాళ్లూరు వెంకటనారాయణ సంఘం జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కుడెల్లి నాగేశ్వరరావు, షేక్ నాగుల్మీరా, పుటేటి వెంకటనారాయణరెడ్డి, మస్తాన్, భసవయ్య, నక్క పుల్లరావు, కోల రామకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి