దారి అడిగిన రైతులు.. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు
దారి అడిగిన రైతులు.. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు
Komidala Mahender reddy
చిట్యాలలో నేరడ మహిళలు, రైతుల ఆందోళన – ‘ఫిర్యాదు ఎవరు చేశారో చెప్పండి’ అంటూ పోలీసులను నిలదీత
నల్గొండ జిల్లా: చిట్యాల
గ్రామానికి వెళ్లే దారి సమస్య పరిష్కారం కాకపోగా, తమను పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారంటూ నేరడ గ్రామానికి చెందిన మహిళలు, రైతులు చిట్యాల పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. సుమారు 50 కుటుంబాలకు చెందిన మహిళలు, రైతులు బైఠాయించి పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గాదిరెడ్డిపల్లి నుంచి నేరడ గ్రామానికి వెళ్లే పాత రైతుల దారికి అడ్డంగా బ్రాహ్మణ వెల్లంల కాల్వ నిర్మాణం చేపట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయని గ్రామస్థులు తెలిపారు. గతంలో సమస్యపై ఆందోళనలు జరగడంతో కాల్వపై బ్రిడ్జి నిర్మిస్తామని హామీలు ఇచ్చినా అమలు కాలేదని పేర్కొన్నారు.
రైతుల విజ్ఞప్తి మేరకు తాత్కాలిక దారి కోసం మంజూరైన సిమెంట్ గుణా పైపులు కూడా దారి నిర్మాణానికి వినియోగించకుండా కొందరు స్థానిక నాయకులు అమ్ముకున్నారని గ్రామస్థులు ఆరోపించారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాల్వను పూడ్చివేసి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారనే ఆరోపణలతో పోలీసులు నేరడ గ్రామానికి చెందిన కుటుంబాలను స్టేషన్కు పిలిపించారు. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని, దారి కోసం మాత్రమే పోరాడుతున్నామని మహిళలు స్పష్టం చేశారు.“మాపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరు? ఏ కారణంతో కేసులు పెడుతున్నారు?” అని ప్రశ్నించినా పోలీసులు సరైన సమాధానం ఇవ్వలేదని మహిళలు ఆరోపించారు. స్థానిక రాజకీయ నాయకుల మాటలు విని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
గ్రామంలో దారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, పైపుల వ్యవహారంపై విచారణ జరిపించాలని, రైతులు–మహిళలపై వేధింపులు నిలిపివేయాలని జిల్లా అధికారులను కోరారు. ప్రస్తుతం ఈ ఘటనతో చిట్యాల పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి