"వేగం కాదు... ప్రాణాలతో గమ్యానికి చేరుకోవడమే ముఖ్యం"
"వేగం కాదు... ప్రాణాలతో గమ్యానికి చేరుకోవడమే ముఖ్యం"
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
యాదాద్రి భువనగిరి జిల్లా వెలిమినేడు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో రాష్ట్ర డీజీపీ వి.వి. శ్రీనివాస్ రావు, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన "అరైవ్ అలైవ్" కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యత, సురక్షిత ప్రయాణంపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ వి.వి. శ్రీనివాస్ రావు, వేగంగా ప్రయాణించడం కంటే సురక్షితంగా ప్రాణాలతో గమ్యానికి చేరుకోవడమే ముఖ్యమని అన్నారు. నిర్లక్ష్య డ్రైవింగ్, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణాల శాతం పెరుగుతోందని పేర్కొన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించడం, కార్లలో సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణించడం వంటి చర్యలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తాయని డీజీపీ సూచించారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటను "గోల్డెన్ అవర్"గా పరిగణిస్తారని, ఆ సమయంలో సరైన చికిత్స అందితే అనేక ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.
ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు క్యాష్లెస్ చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, వెలిమినేడు పరిధిలో రోడ్డు ప్రమాద మరణాలు క్రమంగా తగ్గుతున్నాయని వెల్లడించారు. 2023లో 16 మంది, 2024లో 13 మంది, 2025లో 9 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందగా, 2026లో ఇప్పటివరకు కేవలం ఇద్దరు మాత్రమే మరణించినట్లు తెలిపారు.
పోలీసు శాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు, ట్రాఫిక్ నిబంధనల అమలులో కఠిన చర్యలు, ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం కారణంగానే ప్రమాదాల సంఖ్య తగ్గుతోందని ఎస్పీ పేర్కొన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పిలుపునిచ్చారు.
గ్రామ సభలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై డీజీపీ చేసిన సూచనలు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు దోహదపడనున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి