అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్యే బాలు నాయక్..
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్యే బాలు నాయక్..
NM Yadav
నియోజకవర్గంలో గుడిసెలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
అధికారులతో సమీక్షా సమావేశం అవినీతికి పాల్పడితే సస్పెన్షన్ వేటు..
దేవరకొండ : నియోజకవర్గంలో మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బుధవారం ఎంపీడీవోలు, హౌసింగ్ శాఖ అధికారులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.
అర్హులకు న్యాయం గుడిసెల రహిత నియోజకవర్గం..
సమావేశంలో ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. అర్హులైన పేద కుటుంబాలు ఏ కారణం చేతనైనా 'ఎల్-3' (L3) జాబితాలో ఉండిపోతే, వారి అర్హతలను పునఃపరిశీలించి 'ఎల్-1' (L1) జాబితాలోకి మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గుడిసెలు, తాత్కాలిక మిద్దెల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, వారికి శాశ్వత గృహాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నిజమైన అర్హులను గుర్తించి ఇండ్లు మంజూరు చేస్తాం. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రస్తుతం 226 గుడిసెలు ఉన్నట్లు గుర్తించాం. ఆయా కుటుంబాలన్నింటికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి దేవరకొండను 'గుడిసెలు లేని నియోజకవర్గం'గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని అన్నారు. గతంలో లబ్ధిదారులు సొంతంగా నిర్మించుకుని.. బేస్ మెంట్ లెవెల్, స్లాబ్ లెవెల్, లేదా గోడల దశలో నిలిచిపోయిన అసంపూర్తి ఇండ్లను సైతం ఇందిరమ్మ ఇండ్ల పథకం కిందికి మారుస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఆయా ఇండ్ల నిర్మాణ దశను బట్టి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. మొదటి విడతలో ఇండ్లు మంజూరై, సాంకేతిక కారణాల వల్ల బిల్లులు ఆగిపోయిన వారికి త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రూపాయి ఆశించినా సస్పెన్షనే!
ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరుతో లబ్ధిదారుల నుంచి ఎవరైనా అధికారులు లేదా ప్రజాప్రతినిధులు డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే సహించేది లేదని ఎమ్మెల్యే గట్టిగా హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే తక్షణమే సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని హౌసింగ్ శాఖ అధికారులు, వివిధ మండలాల ఎంపీడీవోలు, విభాగాధిపతులు మరియు సంబంధిత ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి