అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలి.. టీఎస్ యూటీఎఫ్ డిమాండ్
అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలి.. టీఎస్ యూటీఎఫ్ డిమాండ్
NM Yadav
జిల్లా విద్యాశాఖాధికారికి వినతిపత్రం సమర్పణ..
నల్లగొండ విద్యావిభాగం: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఉపాధ్యాయుల అక్రమ డిప్యూటేషన్లను (పని సర్దుబాటు) వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం నల్లగొండలోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బక్క శ్రీనివాసాచారి అధ్యక్షతన జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘బడిబాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు యూటీఎఫ్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. బడి ఈడు పిల్లలు ఉన్న ప్రతి ఆవాస ప్రాంతంలోనూ ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పైరవీలు..
విద్యార్థుల అవసరాలు, పాఠశాలల ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా.. కొంతమంది ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, తమకు అనుకూలంగా ఉండే పాఠశాలలకు డిప్యూటేషన్లు పొందేందుకు అప్పుడే పైరవీలు ప్రారంభించారని వెంకటేశం మండిపడ్డారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే జిల్లాలో ఇష్టారాజ్యంగా యథేచ్ఛగా సాగుతున్న అక్రమ డిప్యూటేషన్ల పర్వం జిల్లా విద్యాశాఖను అభాసుపాలు చేస్తోందని ధ్వజమెత్తారు. కేవలం ఉపాధ్యాయుల స్వార్థ ప్రయోజనాల కోసం విరుద్ధంగా ఇచ్చిన డిప్యూటేషన్లను తక్షణమే రద్దు చేయాలి. వారు ఎక్కడైతే వేతనం తీసుకుంటున్నారో అదే మూల పాఠశాలలో విధులు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాలి.
పారదర్శకంగా పని సర్దుబాటు చేయాలి..
ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు న్యాయం జరిగేలా శాస్త్రీయంగా, పారదర్శకంగా మాత్రమే పని సర్దుబాటు (డెప్యూటేషన్) ప్రక్రియ చేపట్టాలని వారు కోరారు. అలా కాకుండా కేవలం ఉపాధ్యాయుల వ్యక్తిగత అనుకూలత కోసమే డిప్యూటేషన్లు కేటాయిస్తే.. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశం అనంతరం టీఎస్ యూటీఎఫ్ జిల్లా బాధ్యులు నల్లగొండ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) సుసిందర్ రావును కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి. నాగమణి,ఎఫ్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు బి. అరుణ, నర్రా శేఖర్ రెడ్డి,రాష్ట్ర కమిటీ సభ్యురాలు జి. అరుణ,జిల్లా కార్యదర్శులు, జిల్లా కమిటీ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి