ప్రజా పాలన వేదికగా రోడ్డు భద్రత సందేశం
ప్రజా పాలన వేదికగా రోడ్డు భద్రత సందేశం
Komidala Mahender reddy
తొందర ప్రయాణాలే ప్రాణాలకు ముప్పు: డీజీపీ వి.వి. శ్రీనివాస్రావు
చిట్యాల, వెలిమినేడు: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రజా పాలన 99వ రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ వి.వి. శ్రీనివాస్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, జిల్లా పోలీసు శాఖ అధికారులు హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ వి.వి. శ్రీనివాస్రావు ప్రజలు రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకొని వాటిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
“తొందర తొందరగా ప్రయాణాలు చేయడం మానుకోవాలి. రహదారులపై ప్రయాణించే సమయంలో నెమ్మదిగా, ఆచితూచి వెళ్లాలి. సమయం మించిపోతుందనే ఆత్రంతో మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావద్దు” అని ఆయన హెచ్చరించారు.ఒక కుటుంబంలో సభ్యుడిని కోల్పోతే ఆ కుటుంబం ఎదుర్కొనే వేదన మాటల్లో చెప్పలేమని, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధను సమాజం అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షిత జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
తాను 31 ఏళ్ల పోలీసు సేవా కాలంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ అవగాహన అంశాలపై వేలాది మందికి సూచనలు చేశానని, అయినప్పటికీ ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, పోలీసు అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజల్లో చైతన్యం నింపిందని నిర్వాహకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి