బడి తెరువకముందే బదిలీల మేళా.!
బడి తెరువకముందే బదిలీల మేళా.!
NM Yadav
నిబంధనలు తుంగలో తొక్కి డెప్యుటేషన్ల పర్వం..
ప్రజాప్రతినిధుల సిఫారసులకే పెద్దపీట..
కొన్ని ఉపాధ్యాయ సంఘాల చేతుల్లో కీలుబొమ్మగా ‘విద్యాశాఖ’?
పాత డీఈవో అడుగుజాడల్లోనే ప్రస్తుత డీఈవో సుశిందర్ రావు.?
నల్గొండ : జిల్లా విద్యాశాఖ మళ్లీ పాత దారిలోనే పయనిస్తోంది. నిబంధనలకు పాతరేస్తూ.. పాఠశాలలు పునఃప్రారంభం కాకముందే డెప్యుటేషన్ల (సర్దుబాటు) దందాను యథేచ్ఛగా సాగిస్తోంది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు, సర్కారు బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఆర్భాటంగా ‘బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే.. జిల్లా అధికారులు మాత్రం దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. డ్రాపౌట్లు తగ్గించి, విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్లకుండా చూడాల్సిన విద్యాశాఖ.. ఆ పనులను పక్కనబెట్టి ఉపాధ్యాయుల సర్దుబాటు వ్యవహారాల్లో బిజీగా మారిపోవడం జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
సంఘాల చేతుల్లో కొత్త డీఈవో?
జిల్లాకు కొత్తగా వచ్చిన డీఈవో సుశిందర్ రావుపై ఒక ప్రముఖ ఉపాధ్యాయ సంఘం నేతలు గట్టిగా పట్టు సాధించినట్లు జిల్లా విద్యాశాఖ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు సంఘం నేతలు డీఈవోను పూర్తిగా తమ ‘క్యాప్చర్’ లోకి తీసుకున్నారని, వారు చెప్పినట్లే ఫైళ్లు కదులుతున్నాయని ప్రచారం జరుగుతోంది. గతంలో వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచిన పాత డీఈవో అడుగుజాడల్లోనే ప్రస్తుత డీఈవో సుశిందర్ రావు కూడా అడుగులు వేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
నిబంధనలు బేఖాతరు..
నిజానికి విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎంత ఉందో లెక్క తేల్చి, దానికి అనుగుణంగానే ఉపాధ్యాయుల సర్దుబాటు (డెప్యుటేషన్) ప్రక్రియ చేపట్టాలి. కానీ, ఏ బడిలో ఎంతమంది పిల్లలు ఉంటారో, కొత్తగా ఎంతమంది చేరుతారో కనీస అంచనా లేకుండానే అధికారులు డెప్యుటేషన్ల దందాను ముందే మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే మంగళవారం ఇద్దరు ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు చకచకా డెప్యుటేషన్ ఉత్తర్వులు జారీ చేసేశారు. తిరుమలగిరి (సాగర్) మండలం నుంచి మునుగోడు మండలానికి మెడికల్, మానవతా దృక్పథం పేరిట ఒకరికి డెప్యుటేషన్ ఇచ్చారు. అదే కోణంలో చిట్యాల మండలం ఉరుమడ్ల నుంచి నార్కట్పల్లి మండలానికి డెప్యుటేషన్ పై మరో ఉపాధ్యాయుడిని సర్దారు.ఈ రెండు కీలక ఫైళ్లను ఈ నెల 8వ తేదీనే ఉన్నతాధికారుల ఆమోదానికి పంపగా, మరుసటి రోజే (జూన్ 9న) మెరుపు వేగంతో ఉత్తర్వులు జారీ కావడం వెనుక ‘అంతర్గత’ హస్తం ఏ స్థాయిలో పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు.
సిఫారసుల ‘జోరు’.. ప్రదక్షిణల ‘హోరు’..
విద్యార్థుల అవసరాల కంటే ఉపాధ్యాయుల సొంత ప్రయోజనాలకే విద్యాశాఖ ప్రాధాన్యమిస్తోంది. మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం ఇష్టం లేని కొందరు ఉపాధ్యాయులు రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు. ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తెచ్చుకుని, జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాలకో, లేదా జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉండే సౌకర్యవంతమైన పాఠశాలలకో బదిలీ చేయించుకునేందుకు విద్యాశాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసి కేవలం పొలిటికల్ రికమండేషన్ల ఆధారంగానే ఈ డెప్యుటేషన్లు ఇస్తుండటంతో విద్యాశాఖ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి